అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపిన సంగతి తెలిందే. ఇప్పుడు మరో హృదయవిదారక కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం అనంతరం మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ మహేశ్ జీరావాలా (Mahesh Jirawala) ఆచూకీ లభించకపోవడంతో, అతని కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.
ఫోన్ చివరిసారి కనిపించిన స్థలం… ప్రమాద స్థలానికి కేవలం 700 మీటర్ల దూరం!
జూన్ 12 మధ్యాహ్నం జరిగిన ప్రమాదం సమయానికి మహేశ్ అహ్మదాబాద్లోని లా గార్డెన్కు ఓ వ్యక్తిని కలవడానికి వెళ్లారని ఆయన భార్య హేతల్ జీరావాలా తెలిపారు.
“మధ్యాహ్నం 1:14కి మా భర్త ఫోన్ చేసి ‘మీటింగ్ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నా’ అన్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం,” అని హేతల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో మహేశ్ ఫోన్ చివరిసారిగా ఆన్గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మహేశ్ ఆ విమాన ప్రమాదానికి గురై ఉంటారన్న అనుమానం బలపడింది. అతన్ని గుర్తించేందుకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను అధికారులు సేకరించారు.
మ్యూజిక్ ఇండస్ట్రీకి నష్టం?
నరోదా ప్రాంతానికి చెందిన మహేశ్ అసలిపేరు మహేశ్ కలవాడియా. పలు మ్యూజిక్ ఆల్బమ్స్కు దర్శకత్వం వహించిన ఆయన, యువతలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో ఇలా మాయమవడం అతడి సన్నిహితులను షాక్కు గురిచేసింది.
ప్రమాదంలో ఇప్పటివరకు 270 మంది మృతి
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ వైఫల్యం వల్ల కూలిపోయింది. ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. మృతుల మృతదేహాలు పూర్తిగా దెబ్బతినడంతో, డీఎన్ఏ పరీక్షల ద్వారానే గుర్తింపు పనులు సాగుతున్నాయి. ఈ ప్రక్రియ నాలుగో రోజుకు చేరింది.
ఏదైమైనా… బాధాకరం
మహేశ్ కుటుంబానికి ఈ గందరగోళం గడిపే ప్రతి క్షణం భయంతో నిండినదే. అతడి ఆచూకీపై స్పష్టత వచ్చే వరకూ ఎదురుచూడడమే మనం చేయగలిగింది. అట్టడుగున ఉన్న ఆశలతో, ఒక్క మెసేజ్, ఒక్క కాల్కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది…